ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యారంగ పరిరక్షణకు యుటిఎఫ్ కృషి

కందుకూరు , : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 46వ ఆవిర్భావ సభ కందుకూరులోని దాచూరి రామిరెడ్డి విజ్ఞాన భవన్లో జిల్లా కార్యదర్శి వి.సాంబశివరావు అధ్యక్షతన శనివారం నాడు జరిగింది. ముందుగా సీనియర్ నాయకులు టి.నారాయణరావు యుటిఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరజీవులు దాచూరి రామిరెడ్డి, అప్పారి వెంకటేస్వామి, మైనేని వెంకటరత్నం వంటి త్యాగధనులు కృషితో యుటిఎఫ్ రాష్ట్రమంతా విస్తరించి లక్షకు పైగా సభ్యత్వాలు కలిగిన ఏకైక సంఘంగా ఎదిగిదని అన్నారు. 14 మంది శాసన మండలి సభ్యులుగా ఎన్నికయ్యారని, పోరాటాల ద్వారా సాధించుకున్న పెన్షన్ వంటి హక్కులు ఇప్పటి ప్రభుత్వాలు కాలరాయాలని చూస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అప్రెంటిస్ విధానం రద్దు, రీ గ్రూపింగ్ స్కీములు, ఆటోమోటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ వంటి అనేక సౌకర్యాలను పోరాటాలు, ఐక్య ఉద్యమాల ద్వారా యుటిఎఫ్ సాధించిందని తెలిపారు. ఏపిఎంఎస్టిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్వి యన్.బోసుబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ సంఘటితంగా పోరాడి హక్కులను కాపాడుకోవాలని తెలిపారు. కార్యక్రమం అనంతరం కందుకూరు, వివిపాలెం, పొన్నలూరు మండలాల్లో ఇటీవల పదోన్నతు పొందిన ఉపాధ్యాయులను యుటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఘనంగా సన్మానించారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు కొత్తగా చేరిన పాఠశాల్లో మరింతగా పనిచేసి పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యుటిఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్వులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
– సామి వెంకటేశ్వర్లు విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయం….
కందుకూరులోని దాచూరి రామిరెడ్డి విజ్ఞాన భవన్లో సామి వెంకటేశ్వర్లు సంతాప సభ యుటిఎఫ్ సీనియర్ నాయకులు సిహెచ్ ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. యం.కోటేశ్వరరావు మాట్లాడుతూ దాదాపు 15 సంవత్సరాలపాటు కందుకూరులో యుటిఎఫ్ ఆఫీసు నిర్వహణ, సంఘం యొక్క ఆడిట్ వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు టి.నారాయణరావు, కృష్ణకుమార్, ప్రభాకర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.